UPDATED 10th DECEMBER 2017 SUNDAY 8:30 PM
పెద్దాపురం: తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం వాలుతిమ్మాపురం గ్రామంలో ఆదివారం బాంబు కలకలం సృష్టించింది. దీంతో గ్రామస్థులు భయభ్రాంతులకు గురయ్యారు. గ్రామానికి చెందిన చిలకపాటి సుదర్శనం అనే వ్యక్తి గృహాన్ని నిర్మించుకునేందుకు పునాదిని తీసే సమయంలో సుమారు ఎనిమిది కేజీల బరువుతో ఉన్న ఒక బాంబు కనిపించింది. దీంతో భయంతో దాన్ని అక్కడే వదిలి వచ్చేశాడు. గ్రామస్థులు బాంబ్ కలకలంతో పరుగులుతీశారు. విషయం తెలుసుకున్న సిఐ ప్రసన్న వీరయ్య గౌడ్, ఎస్ ఐ కృష్ణభగవాన్ అక్కడకు చేరుకొని దాన్ని పరిశీలించి దాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో జరిగిన యుద్ధం నాటి శకలాలుగా స్థానికులు చెబుతున్నారు. సుమారు 50 సంవత్సరాల క్రితం ఇప్పటిలాగే ఒక బాంబు శకలం కనిపించడంతో దాన్ని స్థానికులు విడగొట్టే ప్రయత్నం చేశారని ఐతే అది ప్రమాదవశాత్తు పేలడంతో ఇద్దరు వ్యక్తులు చనిపోయారని గ్రామస్థులు చెబుతున్నారు. బాంబు వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం దొరికిన బాంబు వలన ప్రమాదం ఏమీ లేదని పోలీసులు నిర్ధారించడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.







