UPDATED 26th JUNE 2019 WEDNESDAY 9:00 PM
గండేపల్లి: యువత మాదక ద్రవ్యాల జోలికి పోవద్దని జగ్గంపేట సిఐ వై. రాంబాబు అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యా సంస్థల ప్రాంగణంలో బుధవారం అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి.కె. రామకృష్ణారావు అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో జగ్గంపేట సిఐ రాంబాబు పాల్గొని మాట్లాడుతూ యువత సన్మార్గంలో పయనించాలని, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. మాదక ద్రవ్యాలను విక్రయించినా, వినియోగించినా చట్టపరమైన శిక్షలకు గురికావాల్సి వస్తుందని చెప్పారు. మాదక ద్రవ్యాలను పూర్తిగా అరికట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ఐక్యరాజ్య సమితి జూన్ 26వ తేదీని మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవంగా ప్రకటించిందని అన్నారు. మాదక ద్రవ్యాలను మీ చుట్టుపక్కల వారు విక్రయించినా, వాడుతున్నట్లు తెలిసినా తక్షణమే తమకు సమాచారం అందిస్తే పూర్తి స్థాయిలో అరికడతామన్నారు. మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు ప్రతీ ఒక్కరూ ముందుకు రావాలని తెలిపారు. చట్టవ్యతిరేకం అయినటువంటి మాదక ద్రవ్యాలను రవాణా చేయడం, అమ్మడం నేరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గండేపల్లి ఎస్ఐ తిరుపతిరావు, అధ్యాపకులు, విద్యార్థినీ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.







