Updated 25 January 2022 Tuesday 06.30 AM
ఆమ్స్టర్డామ్ (రెడ్ బీ న్యూస్): ప్రాణాలను ఫణంగా పెట్టి ఓ వ్యక్తి ప్రమాదకర ప్రయాణం చేశాడు. ఒక భారీ విమానంలో ముందు చక్రాల క్యాబిన్ మధ్యలో (లోపలికి ముడుచుకుని ఉన్న) కూర్చుని దాదాపు 11 గంటల పాటు గాల్లో ప్రయాణించాడు. 35 వేల అడుగుల ఎత్తులో.. మైనస్ డిగ్రీల చలిలో.. ..550 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతున్న విమానంలో.. ఆ వ్యక్తి ఇలా ప్రమాదకర ప్రయాణం సాగించాడు.
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 11 గంటల పాటు ప్రయాణించి తన ప్రాణాలను పణంగా పెట్టాడు. ఆ వ్యక్తి అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో పూర్తి సమాచారం లేనప్పటికీ.. అతను చేసిన పనికి ఎయిర్ పోర్ట్ అధికారులు బిత్తరపోయారు. ఈఘటన నెథర్లాండ్స్ దేశంలోని ఆమ్స్టర్డామ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది.. అక్కడి అధికారులు తెలిపిన వివరాలు మేరకు..ఇటలీకి చెందిన కార్గో విమానం ఒకటి దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్ నుంచి నెథర్లాండ్స్ లోని ఆమ్స్టర్డామ్ షిపోల్ విమానాశ్రయానికి బయలుదేరింది.
మార్గమధ్యలో కెన్యాలోని నైరోబీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన ఆ విమానం.. 11 గంటల ప్రయాణానంతరం ఆమ్స్టర్డామ్ అంతర్జాతీయ ఎయిర్ పోర్టుకు చేరుకుంది. విమానం ల్యాండ్ అయిన కొద్ది సేపటికే.. ముందు టైర్ మధ్యలో ఒక వ్యక్తి ఉన్నట్లు గుర్తించిన ఎయిర్ పోర్ట్ సిబ్బంది.. అధికారులకు సమాచారం అందించారు. అతను బ్రతికే ఉన్నాడని గ్రహించిన అధికారులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈఘటనపై ఎయిర్ పోర్ట్ అధికారులు స్పందిస్తూ.. ఇటువంటి ప్రమాదకర ప్రయాణం చేసిన వ్యక్తులు బ్రతికిబట్టకట్టిన సందర్భాలు లేవని.. ఇంకా భూమిపై నూకలు ఉన్నాయి కాబట్టి ఆ వ్యక్తి ప్రాణాలతో చేరుకోగలిగాడని అన్నారు.. బహుశా అతను నైరోబీలో విమానం ఎక్కి ఉండొచ్చని భావించిన అధికారులు.. అతను నెథర్లాండ్ వచ్చేందుకు న్యాయపరంగా అన్నిరకాల అనుమతులు ముందే తీసుకున్నట్లు తేల్చారు. అయితే 35 వేల అడుగుల ఎత్తులో అది కూడా ప్రాణవాయువు అందని తీవ్ర ప్రతికూల వాతావరణంలో ఆ వ్యక్తి ఎలా ప్రాణాలు నిలుపుకోగలిగాడనే విషయం అధికారులకు అంతుబట్టడంలేదు.
గతంలోనూ ఇటువంటి సంఘటనలు చోటుచేసుకున్నప్పటికీ.. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా వారు ప్రాణాలు కోల్పాయారని ఎయిర్ పోర్ట్ అధికారులు వెల్లడించారు. కాగా నైరోబీ నుంచి ఆమ్స్టర్డామ్ మధ్యలో రోజుకి ఒకే ఒక్క కార్గో విమాన సర్వీస్ ఉంటుందని.. అటువంటి విమానంలోకి సదరు వ్యక్తి ఎలా వచ్చాడు.. ఎపుడు వచ్చాడు అనే విషయంపై మూడు ఎయిర్ పోర్టుల అధికారులు ఆరా తీస్తున్నారు. నెథర్లాండ్స్ చేరుకునేందుకు ముందుగానే ఈ ప్రణాళిక సిద్ధంచేసుకుని ఉంటాడని అధికారులు భావిస్తున్నారు.







