Updated 25 January 2022 Tuesday 10:00 PM
పెద్దాపురం (రెడ్ బీ న్యూస్): రామేశంమెట్ట నుంచి ఏడీబీ రోడ్డు జంక్షన్ మీదుగా గ్రావెల్ను అక్రమంగా తరలిస్తున్న ఎనిమిది లారీలను ఎస్ఐ మురళీమోహన్ మంగళవారం పట్టుకున్నారు. వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా రికార్డులు సక్రమంగా లేకుండా గ్రావెల్ లోడుతో లారీలు వెళ్లడంతో సీజ్ చేశామని ఎస్ఐ తెలిపారు. లూథరన్ హైస్కూల్ గ్రౌండ్కు లారీలను తరలించారు. ఈ అక్రమ గ్రావెల్ తరలింపు వ్యవహారంలో జగ్గంపేటకు చెందిన ఓ పోలీస్ అధికారి భర్త పాత్ర ఉన్నట్టు తెలుస్తోంది. పట్టుబడిన లారీలను విడిచిపెట్టాలని అధికార పార్టీకి చెందిన కొందరు నాయకుల నుంచి పోలీసులకు ఒత్తిళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో అప్పటికే కొన్ని లారీలను పోలీసులు విడిచిపెట్టి మిగిలిన ఎనిమిది లారీలను చూపించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై ఎస్ఐను వివరణ కోరగా కేవలం రికార్డులు సక్రమంగా లేని 8 లారీలను మాత్రమే సీజ్ చేశామని, పట్టుబడ్డ లారీలను మైనింగ్ డిపార్ట్మెంట్కు అప్పగించామన్నారు.







