* ప్రముఖ ఇంప్లాంటాలజిస్ట్ డాక్టర్ అరవింద్
* ఆల్ ఆన్ ఫోర్ పద్ధతిపై లెనోరాలో వర్క్ షాప్
UPDATED 10th DECEMBER 2020 THURSDAY 9:00 PM
రాజానగరం (రెడ్ బీ న్యూస్): ఆధునిక వైద్యరంగం ఆవిష్కరించిన 'డెంటల్ ఇంప్లాంట్' విధానం దంత వైద్య రంగంలో పెను విప్లవానికి బాటలు వేసిందని అందుకే ప్రపంచ వ్యాప్తంగా దీనికి విస్తృతమైన ఆదరణ లభిస్తున్నట్లు ఇంప్లాంట్ జెనెసిస్ సంస్థకు చెందిన ప్రముఖ ఇంప్లాంటాలజిస్ట్ డాక్టర్ అరవింద్ పేర్కొన్నారు. స్థానిక కెఎల్ఆర్ లెనోరా ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ కళాశాలలో ఈనెల 9,10 తేదీల్లో రెండు రోజులు పాటు ఆల్ ఆన్ ఫోర్ అనే నూతన ఇంప్లాంట్ పద్ధతిపై వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ అరవింద్ మాట్లాడుతూ పక్క దంతాలను వేటినీ ముట్టుకోవాల్సిన అవసరం లేకుండా దంతం ఊడిన ప్రాంతంలో కొత్తగా కృత్రిమ దంతాన్ని అమర్చే సమర్థ విధానమే డెంటల్ ఇంప్లాంట్ అని అన్నారు. సాధారణంగా ఎక్కడ దంతం ఊడితే అక్కడ ఇంప్లాంట్ అమర్చవచ్చని, దంతాలు మొత్తం ఊడిన పక్షంలో గరిష్ఠంగా పైదవడలో ఆరు, క్రింది దవడలో ఆరు మొత్తం 12 ఇంప్లాంట్స్ అమర్చి వాటి ఆధారంగా మొత్తం 28 దంతాలను ఏర్పాటు చెయ్యవచ్చని తెలిపారు. ఆరు ఇంప్లాంట్స్ అమర్చటం కూడా కుదరని పక్షంలో నాలుగే అమర్చి, వాటికే అన్ని దంతాలు అమర్చవచ్చని దీన్నే ఆల్ ఆన్ ఫోర్ పద్ధతి అంటారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఈ చికిత్సా విధానం గురించి సవివరంగా చూపించి వారి సందేహాలు సమాధానం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ కె. నాగమణి, కార్యదర్శి వై. మధుసూదన్ రెడ్డి, డైరెక్టర్ జి. నాగార్జునరెడ్డి, డైరెక్టర్ పిజి స్టడీస్ బి. లక్ష్మణరావు, ప్రిన్సిపాల్ డాక్టర్ విశ్వ ప్రకాష్ శెట్టి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వి. దాల్ సింగ్, డాక్టర్ చక్రవర్తి, డాక్టర్ టి.ఎస్.వి. సత్యనారాయణ, డాక్టర్ ఎం. వైష్ణవీదేవి, అధ్యాపకులు, విద్యార్థినీ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.







