UPDATED 31st MARCH 2018 SATURDAY 9:00 PM
పెద్దాపురం: నాలుగువేల సంవత్సరాల నాటి అత్యంత ప్రాచీనమైన అతిరాత్ర ఉత్క్రుష్ట శ్రౌత సోమయాగ మహా క్రతువును భక్తులందరూ విజయవంతం చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప కోరారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణంలో స్థానిక శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయం సమీపంలో పాండవులమెట్ట వద్ద ఏప్రిల్ 14 నుంచి 25వ తేదీ వరకు జరగనున్న అతిరాత్ర యాగశాలలో నిర్మిస్తున్న జలకళ చెరువును మంత్రి చినరాజప్ప శనివారం మోటార్ వేసి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ యాగకర్త కేశాప్రగడ హరిహరనాథశర్మ నేతృత్వంలో నిర్వహిస్తున్న యాగానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అన్ని పనులను పగడ్బందీగా చేయాలని, ఈ యాగానికి ప్రతీ ఒక్కరూ సహకారం అందించాలని అన్నారు. అలాగే ప్రభుత్వపరంగా సహాయ సహాకారాలు అందించడానికి చర్యలు తీసుకుంటానని అన్నారు. అనంతరం యాగశాల పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, వైస్ చైర్మన్ కొరుపూరి రాజు, అన్నవరం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుడు కందుల విశ్వేశ్వరరావు, గుడా డైరెక్టర్ ఎలిశెట్టి నాని, ఆత్మా చైర్మన్ కలకపల్లి రాంబాబు(రాము), ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు ఉదయ్, యాగ రక్షాపురుష శేఖర్ శర్మ, పట్టణ టిడిపి కార్యదర్శి తూతిక రాజు, సహాయ యాగకర్త కేశాప్రగడ రాజశేఖరశర్మ, తదితరులు పాల్గొన్నారు.







