UPDATED 31st OCTOBER 2018 WEDNESDAY 9:00 PM
పెద్దాపురం: దృఢ సంకల్పం, కార్యదీక్ష, పట్టుదల ద్వారా ఆంగ్లేయులకు చెమటలు పట్టించిన వల్లభాయ్పటేల్ భారతదేశపు ఉక్కుమనిషిగా ప్రసిద్ధి చెందారని జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ డాక్టర్ వి. మునిరామయ్య అన్నారు. సర్ధార్ వల్లభాయ్పటేల్ జయంతి సందర్భంగా బుధవారం స్థానిక జవహర్ నవోదయ విద్యాలయంలో రాష్ట్రీయ ఏక్తా దివస్, సంకల్ప్ దివస్ ను పురస్కరించుకుని పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ప్రిన్సిపాల్ డాక్టర్ మునిరామయ్య మాట్లాడుతూ స్వాతంత్య్రం అనంతరం భారతదేశంలో సంస్థానాలు విలీనం కావడానికి ఆయన ఎంతో కృషి చేశారన్నారు. మహాత్మాగాంధీ నేతృత్వంలో కొనసాగిన స్వాతంత్య్ర ఉద్యమంలో పటేల్ కీలకపాత్ర పోషించారన్నారు. కేంద్ర హోంమంత్రిగా, ఉప ప్రధానిగా ఆయన దేశానికి ఎనలేని సేవలు అందించారని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రీయ ఏక్తా ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ పరశురామయ్య, తదితరులు పాల్గొన్నారు.







