UPDATED 28th MARCH 2022 MONDAY 09:50 PM
BJP Foundation day: భారతీయ జనతా పార్టీ 42వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఏప్రిల్ 6 బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా నిర్వహించాలని ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సోమవారం దేశ వ్యాప్తంగా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఏప్రిల్ 6న ప్రధాని మోదీ బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కేంద్ర మంత్రులు సహా కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించనున్నారు.
ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాజపా గెలుపుకి కృషి చేసిన కార్యకర్తలను మోదీ అభినందించనున్నారు. రానున్న 2024 ఎన్నికలకు ఇదే విధంగా కృషి చేసి పార్టీని మరోసారి అధికారంలో నిలబెట్టాలని సందేశాన్ని మోదీ ఇవ్వనున్నట్లు బీజేపీ జాతీయ వర్గాలు వెల్లడించాయి.
ఇక బీజేపీ వ్యవస్థాపక దినోత్సవాన్ని పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాలని జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపునిచ్చారు. ఏప్రిల్ 6న ప్రధాని సమావేశానికి ముందు..పార్టీ కార్యకర్తలు, నేతలు ముందుగా జాతీయ జెండా ఎగురవేసి, వందేమాతరం ఆలపించాలని, దేశ భక్తి గీతాలు ఆలపించి..30 నిముషాల పాటు శోభా యాత్ర చేపట్టాలని నడ్డా సూచించారు. ఏప్రిల్ 6 నుంచి ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి వరకు వివిధ సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టాలని నడ్డా తెలిపారు.
రక్త దానం, కరోనా వ్యాక్సిన్ పంపిణీ సహా మహిళల ఆరోగ్యం, భద్రత, పౌష్టికాహారం వంటి విషయాలపై అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలని బీజేపీ అధ్యక్షుడు పార్టీ శ్రేణులకు సూచించారు.







