* ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
* టాటా ఏస్ వాహనం సీజ్
UPDATED 23rd AUGUST 2019 FRIDAY 8:00 PM
మారేడుమిల్లి (రెడ్ బీ న్యూస్) : తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో అక్రమంగా తరలిస్తున్న 148 కిలోల గంజాయిని శుక్రవారం ఉదయం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా రంపచోడవరం ఏఎస్పీ వకుల్ జిందాల్ మారేడుమిల్లి పోలీస్ స్టేషనులో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. మారేడుమిల్లి మీదుగా అక్రమంగా గంజాయి రవాణా అవుతోందనే ముందస్తు సమాచారం మేరకు మారేడుమిల్లి సీఐ రవికుమార్, ఎస్ఐ టి. రామకృష్ణ, ఇతర పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో మండల పరిధిలోని మద్దులూరు సమీపంలో వాహన తనిఖీలు చేపట్టారని, ఈ క్రమంలో ఒక టాటా ఏస్ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి 69 ప్యాకెట్లలో తరలిస్తున్న సుమారు 148 కిలోల గంజాయి, సెల్ ఫోన్, టాటా ఏస్ వాహనాన్ని తహసీల్దార్ సమక్షంలో స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. నిందితులు తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం కొటపూర్ గ్రామానికి చెందిన కర్రి సందీప్, విశాఖపట్నం జిల్లా గూడెం కొత్తవీధి మండలంలోని కొంగపాకలు గ్రామానికి చెందిన తెడ్ల ప్రసాద్లను అరెస్టు చేశామని, కేసు నమోదు చేసి నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు ఆయన తెలిపారు.







