UPDATED 1st SEPTEMBER 2017 FRIDAY 10:30 PM
కాకినాడ: అఖిల భారత అండర్-13, 15 బ్యాడ్మింటన్ పోటీలు స్థానిక జేఎన్టీయూకే గ్రౌండ్స్ లో శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప హాజరై మాట్లాడారు. బ్యాడ్మింటన్ క్రీడకు క్రమేపీ ఆదరణ పెరుగుతోందని, ఒలింపిక్స్లో పతకం సాధించిన సింధు క్రీడాకారులకు ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. గతంలో క్రీడల పట్ల తల్లిదండ్రులు అంతగా ఆసక్తి కనబరిచేవారు కాదని, ప్రస్తుతం వీరు క్రీడలపై దృష్టి సారించటం వల్ల ప్రతిభ గల క్రీడాకారులు బయటకు వస్తున్నారన్నారు. క్రీడలకు ప్రభుత్వం సహాయం అందిస్తున్నప్పటికీ ప్రైవేటు భాగస్వామ్యంతో ముందుకు వెళితే మరిన్ని అద్భుత ఫలితాలు సాధించవచ్చన్నారు. రాష్ట్ర బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు తేతలి నారాయణరెడ్డి మాట్లాడుతూ కాకినాడలో మూడోసారి జాతీయస్థాయి పోటీలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నామని, 29 రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు అధిక సంఖ్యలో హాజరయ్యారని, వీరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. మొదటి నాలుగు రోజులపాటు క్వాలిఫై మ్యాచ్లు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, సత్తిబాబు, జిల్లా మార్కెటింగ్ శాఖ డైరక్టర్ కేవీ సత్యనారాయణరెడ్డి, టోర్నమెంట్ డైరక్టర్ ఏఆర్ దామోదర్, ఆలిండియా బ్యాడ్మింటన్ సంఘ కార్యదర్శి కేసీహెచ్ పున్నయ్యచౌదరి, కాకినాడ బ్యాడ్మింటన్ సంఘ అధ్యక్షుడు వీరభద్రారెడ్డి, సంఘ సీనియర్ ఉపాధ్యక్షుడు కొడాలి తనూజ, శ్రీనివాసరెడ్డి, కేశవభట్ల శ్రీనివాసరావు, జేఎన్టీయూకే పీడీ శ్యాంకుమార్, తదితరులు పాల్గొన్నారు.







