Updated 27 January 2022 Thursday 10:00 PM
★ కలెక్టర్ హరికిరణ్
కాకినాడ (రెడ్ బీ న్యూస్): జిల్లాలోని 1,271 గ్రామ సచివాలయాలు, 319 వార్డు సచివాలయాల ద్వారా మరింత పారదర్శకంగా, జవాబుదారీతనంతో పౌర సేవలు అందించేందుకు ఏపీ సేవ పోర్టల్ వీలు కల్పిస్తుందని కలెక్టర్ సి.హరికిరణ్ వెల్లడించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి వర్చువల్ విధానంలో ఏపీ సేవ పోర్టల్ సిటిజన్ సర్వీస్ పోర్టల్ను గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కలెక్టరేట్ వివేకానంద హాల్ నుంచి కలెక్టర్ హరికిరణ్ జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరి, అధికారులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బహుళ ప్రయోజనాలున్న ఈ సమీకృత డిజిటల్ వేదిక ద్వారా పౌర సేవలు మరింత నాణ్యంగా అందనున్నాయన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పొందుతున్న సేవలలో 90 శాతానికి పైగా రెవెన్యూ, సీసీఎల్ఏ, పట్టణాభివృద్ధి, పౌరసేవలు, గ్రామీణాభివృద్ధి, విద్యుత్ శాఖలకు చెందినవే ఉంటున్నాయని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కరప ఎంపీడీవో కె.స్వప్న, కలెక్టరేట్ వివిధ సెక్షన్ల అధికారులు పాల్గొన్నారు.







