అర్ధాంతంగా ముగిసిన జడ్పీ తొలి సమావేశం
కాకినాడ (రెడ్ బీ న్యూస్) 12 డిసెంబర్ 2021: రాష్ట్ర ప్రభుత్వం జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ద్వారా అమలు చేస్తున్న ఓటీఎస్ అంశం జిల్లా పరిషత్తు తొలి సర్వసభ్య సమావేశాన్ని కుదిపేసింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. హౌసింగ్ పీడీ సుదర్శన్ పట్నాయక్ జిల్లాలో గృహ నిర్మాణ సంస్థ ద్వారా చేపట్టిన గృహ నిర్మాణాలు, ఓటీఎస్పై ప్రస్తుతమున్న పరిస్థితిని వివరించారు. ఓటీఎస్ పేరుతో పేదలపై భారం మోపొద్దని తెదేపా ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి సూచించారు. కొవిడ్ వల్ల అంతా ఆర్థికంగా చితికిపోయారని రూ.10 రుసుముతో రిజిస్ట్రేషన్లు చేసి ఇవ్వాలని కోరారు. దీనిపై మంత్రి కన్నబాబు కులగజేసుకుని ఓటీఎస్ పూర్తి స్వచ్ఛందమని లబ్ధిదారులను ఒత్తిడికి గురిచేయడం లేదన్నారు. జడ్పీ ఛైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన ఆదివారం జిల్లా పరిషత్తు సమావేశ మందిరంలో జరిగిన తొలి సమావేశంలో ముందుగా జనరల్ బిపిన్ రావత్ మృతికి సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించి, సంతాపం తెలిపారు. అనంతరం 34 శాఖలకు సంబంధించిన అంశాలను చర్చించాలని అజెండాలో పొందుపర్చగా, కేవలం గృహ నిర్మాణం, వ్యవసాయం, ఇరిగేషన్, వైద్యఆరోగ్యశాఖలపై చర్చించి, అర్ధాంతరంగా ముగించేశారు.







