UPDATED 21st MARCH 2021 SUNDAY 8:00 PM
రాజానగరం (రెడ్ బీ న్యూస్): ఎలాంటి సమయంలోనైనా సేవా కార్యక్రమాల నిర్వహణలో రెడ్ క్రాస్ సంస్థ ముందు వరసలో ఉంటుందని, సంస్థ అందిస్తున్న సేవలు ఎంతో అభినందనీయమని రాజమహేంద్రవరం ఈస్ట్ జోన్ డిఎస్పీ ఎ.టి.వి. రవికుమార్ అన్నారు. రెడ్ క్రాస్ సంస్థ స్థాపించి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆదేశాల మేరకు సంస్థ చైర్మన్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈనెల 16వ తేదీన శ్రీకాకుళం నుంచి ప్రారంభమై విజయవాడ వరకు చేరుకోనున్న సైకిల్ ర్యాలీ ఆదివారం రాజానగరం చేరుకుంది. ఈ సందర్భంగా సంస్థ కార్యనిర్వాహక సభ్యుడు వై. మధుసూదన్ రెడ్డి, లెనోరా దంత వైద్య కళాశాల, ఆసుపత్రి చైర్ పర్సన్ కె. నాగమణి, డిఎస్పీ రవికుమార్ ర్యాలీకి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ కోవిడ్ సమయంలో సంస్థ వాలంటీర్లు అందించిన సేవలు అభినందనీయమని, రక్తదానం, మొక్కలు పెంపకం, తదితర అంశాలతో పాటు ప్రకృతి వైపరీత్యాల సమయాల్లో కూడా ముందువరసలో నిలిచి ప్రజలకు అండగా నిలిచారని అన్నారు. అనంతరం డిఎస్పీ, తదితరులు ఈ సందర్భంగా కళాశాలలో మొక్కలు నాటారు.







