UPDATED 30th JULY 2018 MONDAY 9:00 PM
సామర్లకోట: పట్టణ పరిధిలో గల వార్డుల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో అధికారుల నిర్లక్ష్యంపై కౌన్సిలర్లు ఫైర్ అయ్యారు. స్థానిక మున్సిపాలిటీలో మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం తాత్కాలిక చైర్మన్ బడుగు శ్రీకాంత్ అధ్యక్షతన సోమవారం జరిగింది. ఈ సమావేశంలో ప్రతిపక్ష నాయకుడు ఆవాల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్లీడరు గారి తోటలో రోడ్లు, డ్రైన్లు లేవని వర్షం వస్తే చెరువుగా మారుతుందని ఆరోపించారు. అర్బన్ హెల్త్ సెంటర్ వద్ద రోడ్లు గోతులమయంగా ఉందని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని, దీనివల్ల రోగులు, ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సీనియర్ కౌన్సిలర్ మన్యం చంద్రరావు తాత్కాలికంగా గ్రావెల్ వేసి గోతులు పూడ్చాలని అధికారులను ఆదేశించారు. మరో రెండు నెలల్లో మున్సిపాలిటీ పరిధిలో గల అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని ఆయన తెలిపారు. మున్సిపాలిటీ స్థలాలు ఆక్రమణకు గురవుతున్నాయని స్వయంగా ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోలేదని కౌన్సిలర్ ఊబా జాన్ మోజెస్ టౌన్ ప్లానింగ్ అధికారులపై మండిపడ్డారు. టౌన్ ప్లానింగ్ అధికారి రత్నకుమార్ మాట్లాడుతూ స్థలాలను పరిశీలించిన తరువాత తక్షణం చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. భావాల అప్పారావు ఇంటి వద్ద నుంచి ఉన్న మేజర్ డ్రైన్ శిథిలావస్థకు చేరుకుందని, ఆ డ్రైన్ తక్షణం నిర్మించాలని మరో కౌన్సిలర్ కాళ్ళ లక్ష్మీ నారాయణ అన్నారు. దీనికి సమాధానంగా మున్సిపల్ కమీషనర్ మాట్లాడుతూ 14వ ఆర్థిక సంఘ నిధులతో డ్రైన్ నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.







