UPDATED 29th AUGUST 2022 MONDAY 09:30 PM
Mukhesh Ambani: భారత నంబర్ 1 కుబేరుడు, ఆసియాలోనే రెండో ధనవంతుడు.. ముఖేష్ అంబానీ దుబాయ్ లో ఖరీదైన, అంత్యంత విలాసవంతమైన విల్లాను కొనుగోలు చేశాడు. సముద్రంలో ఉండే పామ్ జుమేరా దీవుల్లో సుమారు 80 మిలియన్ డాలర్లు( రూ.640 కోట్లు) వెచ్చించి మరీ ఈ విల్లాను కొనుగోలు చేసినట్లు వస్తున్నాయి. చిన్న కుమారుడు అనంత్ అంబానీ కోసం దుబాయ్ లో ఈ ఖరీదైన విల్లాను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అంబానీ కొన్న విల్లా, బీచ్ సైడ్ మాన్షన్ కు నార్త్ సైడ్ లో ఉన్న 10 బెడ్రూముల ఫ్లాట్ లో ఒకటిగా చెప్తున్నారు.
ధనవంతులకు స్వర్గధామంలా ‘పామ్ జుమైరా’
దుబాయ్ సమీపంలోని సముద్రంలో నిర్మించిన కృత్రిమ దీవులు ఇవీ. ఈత చెట్లను పోలిన ఈ కృత్రిమ దీవుల్లో అత్యంత విలాసవంతమైన భవనాలను దుబాయ్ ప్రభుత్వం నిర్మించింది. సకల సౌకర్యాలు కల్పించింది. విదేశీయులు అక్కడ ఆస్తులు కొనేందుకు పరిమితులను కూడా సడలించింది. వారు దీర్ఘకాలం పాటు అక్కడే నివసించేలా గోల్డెన్ వీసాలు కూడా ఇస్తోంది ఎమిరేట్స్ సర్కారు. ఈ క్రమంలో అందరి చూపే పామ్ జమైరా వైపే ఉంది. బ్రిటీష్ ఫుట్ బాల్ ఆటగాడు డేవిడ్ బెక్ హామ్, బాలీవుడ్ మెగా స్టార్ షారుఖ్ ఖాన్, అనంత్ అంబానీకి ఇరుగు పొరుగు వారన్నట్లు సమాచారం.
బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ముఖేష్ అంబానీ 93.3 బిలియన్ డాలర్ల సంపాదనతో ప్రపంచంలో 11వ అత్యంత సంపన్నుడిగా ఉన్నారు. తన వ్యాపార సామ్రాజ్యాన్ని గ్రీన్ ఎనర్జీ, టెక్, ఇ-కామర్స్ వైపు విస్తరిస్తూ పోతున్నారు. ఇప్పుడు, ఆయా బాధ్యతలను వారి వారసులకు అప్పగించే పనిలో ఉన్నారు. ఇప్పటికే.. వ్యాపారాలను ఇద్దరు కుమారులు, కూతురుకు సమంగా పంచినట్లు వార్తలొస్తున్నాయి. రిలయన్స్ జియోకు ఆకాష్ చైర్మన్ కాగా, ఈకామర్స్ లకు ఈషా అంబానీ హెడ్ గా వ్యవహరించడమే అందుకు నిదర్శనం. ఇప్పుడు.. అనంత్ కు రిలయన్స్ ఇండస్ట్రీస్ ను అప్పగించనున్నారు. పెట్రో కెమికల్స్ రంగానికి చెందిన వ్యాపారం కావడంతో అనంత్ కోసం దుబాయ్ లో ఈ విల్లాను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.







