UPDATED 10th FEBRUARY 2022 THURSDAY 10:00 PM
న్యూఢిల్లీ (రెడ్ బీ న్యూస్): అంతర్జాతీయ ప్రయాణికులకు కేంద్రం పెద్ద శుభవార్త చెప్పింది. వారికి ఇప్పటి వరకు ఉన్న తప్పనిసరి క్వారంటైన్, ఆర్టీపీసీఆర్ పరీక్షల నిబంధనలను ఎత్తివేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సవరించిన నిబంధనలను విడుదల చేసింది. ప్రయాణానికి 72 గంటల ముందు చేయించుకున్న ఆర్టీ పీసీఆర్ నెగటివ్ రిపోర్టుతోపాటు, వ్యాక్సినేషన్ పూర్తయినట్టు ఆయా దేశాలు జారీ చేసిన సర్టిఫికెట్ను అప్లోడ్ చేసే అవకాశం కూడా ఉన్నట్టు పేర్కొంది. అలాగే, దేశంలో అడుగుపెట్టిన తర్వాత ఎనిమిదో రోజు ఆర్టీపీసీఆర్ టెస్టు చేయించుకుని దాని రిపోర్టును ఎయిర్ సువిధ పోర్టల్లో అప్లోడ్ చేయాలన్న నిబంధనను కూడా తొలగించింది. సవరించిన మార్గదర్శకాల ప్రకారం ప్రయాణికులు నమూనాలు ఇచ్చి విమనాశ్రయం నుంచి బయటకు వెళ్లిపోవచ్చు.
ప్రస్తుతం ఉన్న ఏడు రోజుల క్వారంటైన్ నిబంధనలను కూడా ప్రభుత్వం ఎత్తివేసింది. బదులుగా ఇండియాలో ల్యాండ్ అయిన తర్వాత 14 రోజుల పాటు స్వీయ పర్యవేక్షణ చేసుకోవాలని సూచించింది. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం తగ్గడం, కరోనా నుంచి పలు దేశాలు బయటపడిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.







