UPDATED 12 MARCH 2022 SATURDAY 06:00 AM
BSP Mayawati: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై బిఎస్పి అధినేత్రి మాయావతి మొదటిసారిగా స్పందించారు. ఎన్నికల్లో తమ పార్టీ ఘోర పరాజయం మూటగట్టుకోవడంపై మాయావతి స్పందిస్తూ ఈ ఎన్నికల ఫలితాల కంటే దారుణంగా మరొకటి ఉండదంటూ ఉసూరుమన్నారు. మైనారిటీ కమ్యూనిటీపై నమ్మకం ఉంచినందుకు తాను బాధపడ్డానని, ఇది బిఎస్పికి పెద్ద గుణపాఠమని, ఇది భవిష్యత్తులో వ్యూహాత్మక మార్పును తీసుకువస్తుందని తాను భావిస్తున్నట్లు మాయావతి అన్నారు.
ముస్లిం, దళితుల ఓట్లు కీలకంగా ఉన్న యూపీలో ఓట్ల చీలిక లేకుండా ఉంటే యూపీలో మరో భిన్నమైన ఫలితం వచ్చేది.ఎస్పి వెనుక ముస్లింల ఏకీకరణ కారణంగా ఇతర వర్గాలు బిజెపి వైపు మళ్లడానికి కీలకమైన అడుగులుపడ్డాయని మరియు బీఎస్పీ ప్రధాన ఓటు బ్యాంకు చీలిపోవడానికి ఇదే కారణమని మాయావతి అన్నారు. ఓటమి పై పార్టీ నేతలతో కలిసి విశ్లేషించుకున్న మాయావతి.. ప్రజలు ఇంతలా తమపై వ్యతిరేకత చూపిస్తున్నట్లు తాము అంచనా వేయలేకపోయామని చెప్పుకొచ్చారు. ప్రస్తుత ఎన్నికల్లో బీఎస్పీకి కేవలం ఒక సీటు సాధించడం.. 13% కంటే తక్కువ ఓట్లతో అత్యల్ప స్థాయికి చేరుకుందని అంగీకరించిన ఆమె, తన పార్టీకి భవిష్యత్తు లేకుండా పోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.







