UPDATED 23 JANUARY 2022 SUNDAY 07:00 AM
బెంగళూరు (రెడ్ బీ న్యూస్): దేశంలో మరోసారి మంకీ ఫీవర్ కలకలం రేపుతోంది. కర్ణాటకలోని షిమోగా జిల్లాలో ఇటీవల ఒక మహిళ జ్వరంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరింది. ఆసుపత్రిలో కొన్ని రోజుల పాటు ఆ మహిళకు చికిత్స అందించిన వైద్యులు, ఎంతకీ జ్వరం తగ్గకపోవడంతో పరీక్షలు జరిపారు. అందులో సదరు మహిళకు మంకీ ఫీవర్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. 2022లో మొట్టమొదటి మంకీ ఫీవర్ కేసు నమోదు కావడంపై రాష్ట్ర వైద్యశాఖ అప్రమత్తం అయింది. ప్రస్తుతం బాధితురాలికి తీర్థహళ్లి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మంకీ ఫీవర్ కోతుల నుంచి మనుషులకు సోకె వైరల్ ఇన్ఫెక్షన్ తో కూడిన జబ్బు. దాదాపుగా డెంగీ లక్షణాలు ఉండే ఈ జబ్బులో.. బాధితులు ఎంతకూ తగ్గని జ్వరం, ఒళ్లునొప్పులు వంటి తీవ్ర లక్షణాలతో బాధపడుతుంటారు. దక్షిణాసియా ప్రాంతంలోని కోతుల నుంచి ఇది మనుషులకు సంక్రమించినట్లు గతంలో పరిశోధకులు తేల్చారు. కరోనాకు ముందు రెండేళ్ల క్రితం కర్ణాటక రాష్ట్రంలోనే మంకీ ఫీవర్ కేసులు బయటపడ్డాయి. రాష్ట్రంలోని సాగర్ మండలం అరలగోడు గ్రామంలో అనేక మంది ఈ మంకీ ఫీవర్ భారిన పడగ, దాదాపు 25 మందికి పైగా మృతి చెందారు. అనంతరం ఇటివంటి కేసులు బయటపడలేదు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న నేపథ్యంలో మరోసారి మంకీ ఫీవర్ కేసు నమోదు కావడం తీవ్ర కలకలం రేపుతోంది.







