UPDATED 20th JULY 2018 FRIDAY 9:00 PM
సామర్లకోట: కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలతో పాటు, రాష్ట్రానికి ప్రత్యేకహోదాను సాధించే వరకు పోరాటం ఆగదని తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు చల్లా బుజ్జి పేర్కొన్నారు. సామర్లకోట మండలం హుస్సేన్ పురం గ్రామంలో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కేంద్రంపై తమ పార్టీ ఎంపీలు ప్రవేశపెట్టిన అవిశ్వాసానికి మద్దత్తుగా టిడిపి నాయకులు గ్రామంలో శుక్రవారం కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బుజ్జి మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి కోసం పార్లమెంట్లో గళమెత్తిన మన ఎంపీలకు ప్రజలంతా అభినందనలు తెలపాలన్నారు. ఈ రోజు ప్రారంభమైన ఈ నిరసనలు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చేవరకు కొనసాగుతాయన్నారు. అన్యాయంగా రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే బిజెపికి తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.







