UPDATED 29th AUGUST 2017 TUESDAY 10:00 PM
కిర్లంపూడి: తమ కుటుంబానికి ఎప్పుడూ నేర చరిత్ర లేదని, హక్కుల కోసం పోరాటం చేస్తున్నామే తప్ప తప్పు చేసే ఆలోచన లేదని, అలాంటప్పుడు పోలీసుస్టేషన్లో వ్యక్తిగత పూచీకత్తు ఎందుకు తీసుకోవాలని కాపు ఉద్యమ నేత, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాయతీగా ఉన్నంతకాలం, ఇతరులకు హాని తలపెట్టనప్పుడు, చట్టాన్ని గౌరవిస్తున్నంతకాలం ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. 33 రోజులపాటు ఎంతో ఓర్పుతో పాదయాత్రకు అనుమతి కోసం ఎదురు చూశామని అనుమతి ఇవ్వకపోగా, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు తమను చులకనగా మాట్లాడడం మొదలు పెట్టారని, వాటిని సహించలేక తమ సత్తా చూపించాల్సి వచ్చిందన్నారు. కేంద్ర మాజీ మంత్రి ఎం.ఎం. పళ్లంరాజు, మాజీ ఎంపీ జి.వి.హర్షకుమార్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పంతం నానాజీలు మంగళవారం ముద్రగడను కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు దీటుగా స్పందించి తగిన సందేశం పంపించారని, కాపులకు చంద్రబాబు ఇచ్చిన హామీని మూడేళ్లపాటు విస్మరించడం దారుణమన్నారు. త్వరలోనే కమిషన్ నివేదిక వస్తుందంటూ ఏడాది కాలంగా చెప్పుకుంటూ వస్తున్నారని దానికి అసలు కాలవ్యవధి అంటూ లేదా అని విమర్శించారు. హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేయడం ముఖ్యమంత్రికి ఫ్యాషన్గా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఆకుల రామకృష్ణ, ఆరేటి ప్రకాష్, గోపు అచ్యుతరామయ్య, తదితరులు పాల్గొన్నారు.







