Updated 17th April 2023 Monday 8:10 am
Maharashtra Heatstroke : మహారాష్ట్రలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర రాజధాని ముంబయిలో నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నవారిలో వడదెబ్బ కారణంగా 11 మంది మరణించగా, వంద మందికిపైగా అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం ‘మహారాష్ట్ర భూషణ్’ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఖర్ఘార్ ఇంటర్నేషనల్ కార్పొరేట్ పార్క్ మైదానంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేలాది మంది సామాజిక కార్యకర్తలు, ఉద్యమకారులు హాజరయ్యారు.
మహారాష్ట్ర భూషణ్ అవార్డు పొందిన సామాజిక కార్యకర్త దత్తాత్రేయ నారాయణ్ అలియాస్ అప్పాసాహెబ్ ధర్మాధికారిని సత్కరించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కార్యక్రమం జరిగింది. కేంద్ర మంత్రి అమిత్ షా, మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండేతో పాటు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫండ్నవీస్, కేంద్ర మంత్రి కపిల్ పాటిల్ తదితరులు హాజరయ్యారు. అమిత్ షా దత్తాత్రేయ నారాయణ్ ను అవార్డుతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో లక్షలాది మంది పాల్గొన్నారు. అయితే, ఈ మైదానంలో కేవలం వీఐపీలు కూర్చునేందుకు మాత్రమే టెంట్లను ఏర్పాటు చేశారు. మిగిలిన మైదానంలో ఎక్కడా టెంట్లు ఏర్పాటు చేయలేదు. దీంతో కార్యక్రమంలో పాల్గొన్న వారంతా ఎండలోనే ఉండి వీక్షించారు. మహారాష్ట్ర నుంచి మాత్రమే కాకుండా మధ్యప్రదేశ్, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంకు హాజరయ్యారు.
ఎండ తీవ్రత కారణంగా చాలామంది వడదెబ్బకు గురయ్యారు. వీరిలో ఎనిమిది మంది మహిళలతో సహా 11 మంది మరణించారు. వంద మందికిపైగా వడదెబ్బ కారణంగా అస్వస్థతకుగురై ఆస్పత్రిలో చేరారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. మృతుల్లో రాయ్ఘడ్కు చెందిన జయశ్రీ పాటిల్ (54) ఖర్ఘర్ వేదికపైనే గుండెపోటుకు గురయ్యారు.
ఈ ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. వడదెబ్బ కారణంగా అస్వస్థతకు గురైనవారు చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వెళ్లి వారిని పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ. 5లక్షల పరిహారం అందజేస్తామని ఈ సందర్భంగా సీఎం ప్రకటించారు. చికిత్స పొందుతున్న వారికి ఉచిత వైద్య సదుపాయాలు అందిస్తామని చెప్పారు. అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఏక్నాథ్ షిండే ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి లక్షలాది మంది ప్రజలు వచ్చారు. బాగా జరిగింది. వారిలో కొందరు బాధపడటం బాధాకరం. ఇదిచాలా దురదృష్టకర పరిస్థితి. ఈ ఘటన నాకు చాలా బాధను కలిగించిందని షిండే చెప్పారు.







