UPDATED 20th SEPTEMBER 2017 WEDNESDAY 9:00 PM
రాయవరం: తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం వెదురుపాక విజయదుర్గా పీఠంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు పీఠం పిఆర్వో వాడ్రేవు వేణుగోపాల్ (బాబీ) తెలిపారు. 1972 సంవత్సరం ఆగష్టు 18 నుంచి విజయదుర్గా పీఠంలో శరన్నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. 1989 లో శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థ చేతుల మీదుగా ఈ పీఠం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పీఠాధిపతి గాడ్ ఈ పీఠాన్ని నిర్మించి విజయదుర్గా అమ్మవారిని ఈ పీఠంలో నెలకొల్పి పూజలు నిర్వహించడం ప్రారంభించారు. శ్రీ చక్రార్చనలకు ప్రత్యేకమైన విజయదుర్గా పీఠం హిందూ పురాణాల ప్రకారం మణిద్వీపంలో అమ్మవారు కొలువై ఉంటారని, జగన్మాత అయిన ఆదిపరాశక్తి శ్రీ చక్రంలో గల తొమ్మిది కోణాల మధ్య బిందురూపంలో కొలువై ఉంటుందని, అలాంటి అమ్మవారి స్వరూపంగా భావించే శ్రీచక్రం పై భక్తులు స్వయంగా దుర్గా అష్టోత్తర సహస్రనామాలు , లలితా సహస్రనామాలుతో స్వయంగా కుంకుమ పూజలు చేసుకునే అవకాశం భక్తులకు కల్పించడం ఇక్కడ ప్రత్యేకం గా చెప్పుకోవచ్చు. నవరాత్రుల్లో స్వయంగా కుంకుమ పూజలు చేసేందుకు రాష్ట్రం నలుమూలలనుంచి ఈ పీఠానికి వస్తుంటారు. పీఠానికి వచ్చే భక్తుల కోసం ఇప్పటికే అన్ని ఏర్పాటు పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.







